సరళ మార్గము
(క్రైస్తవ పద్య నాటకము)
(యోహాను)
రచన
పి. సుబ్బరాయుడు,
42/490 ఎన్.జి.ఒ కాలని
కడప--516002
సెల్: 9966504951
ఇందలి పాత్రలు
1. యోహాను(50)
2. శిష్యుడు-1(25)
3. శిష్యుడు-2(25)
4.యాజకుడు(50)
5. క్రీస్తు
6. హెరోదు
7. హెరోదు కూతురు.
8. సైతాను
సరళ మార్గము
(క్రైస్తవ పద్య నాటకము)
మొదటి రంగము
నాంది
దేవుడు లోకమును యెంతో ప్రేమించెను. విశ్వము శాంతిమయమై భక్తి ప్రకంపనలతో నిండి యుండుట ఆయన కిష్టము. మొదటి మానవుడైన "ఆదాము" అవిశ్వాస ఫలితముగా పోగుట్టుకొనిన దైవసామ్రాజ్యాన్ని తిరిగీ మానవుల కందజేయుటకై, దైవమే అవకాశాన్ని కలుగ జేయ నున్నాడు.ఈ కార్యమునకై ఆయన తన ప్రియ పుత్రుని భూమిపై అవతరింప జేసినాడు. ఆయనే క్రీస్తు. ఆపతిత పావనుని దారిని సుగమము చేసి ఆయన రాకకై యీ అరణ్యమున "యోర్దాను " నదీతీరమున ఒంటెరోమముల వస్త్రములను, మొలకు తోలుదట్టియు ధరించి తేనెయు మిడుతలను ఆహారముగా తీసుకొనుచూ "యోషయా" గ్రంధ లేఖనాను సారముగా కారనజన్ముడై వెలసియున్న ఆ మహనీయుడే "యోహాను". అడుగో యిటే అరుదెంచుచున్న ఆయనే యోహాను మహాశయుడు... యోహాను మహాశయుడు....
యోహాను:- (అరణ్యములో పాట
శరణు శరణు మమ్మేలు నాయక - శరను దైవసుపుత్రకా
శరణు దీనరక్షైకారంభక - శరణు ప్రేమస్వరూపకా
కొండకోనలు అడవి దారులు - చెట్టు గుట్టలు ఝరములూ
క్రమముతో నీరాకకై యిట - ఎదురుచూపులు చూచెనూ......./శరణు/
దైవభక్తులు సుమతులుత్తమ - జనులు ఙ్ఞానులు దీనులూ
ప్రియముతో నీరాకకై యిల - కాచుకొని యున్నారయా......../శరణు/
అందునన్ నీ దాసుడను నే - నిన్ను గొల్వగ నిలిచితీ
నిన్నపము వినవయ్య స్వామీ - మమ్ము గావగరావయా....../శరణు/
శిష్యుడు-1 :- అడుగో..
కం: అతడే భక్తశిఖామణి
హితకరి యోహాననంగ నిమ్మహి మెలగున్
సతతమ్ము మేము కొలుతుము
పతనమ్మై పోవ పాప పంక్తి చయమ్ముల్.
శిష్యుడు 2:- మహాశయా! వీరు మీ దర్శనము కోసమే దయచేశారు..
యాజకుడు:- ఓహో! .. యోహానంటే నీ వన్న మాట.
యోహాను:- చిత్తం నన్నే యోహానని పిలుస్తారు. తమరిటు దయచేసి యీ శిలా పీ ఠాన్నలంకరించండి.. ఆ.. తమరెవరో సెలనిచ్చారు కాదు..
యాజకుడు:- మేము యొరుషలేం వాస్తవ్యులం. ఆలయ ప్రధాన యాజకులం
యోహాను:- నమస్కారం. తమరి దర్శనం వల్ల మాకు మహదానందమైనది. తమరింతదూరం.. ఈ సామాన్యునికోసం వెతుక్కొంటూ రావడానికి గల కారణమేమిటో సెలవిస్తారా? అఁ! మరచాను .. ప్రియమిత్రులారా వెళ్ళి పళ్ళూ తేనె తీసుకరండి. యాజకోత్తములకు సమర్పించుకొందాం.
శిష్యుడు-1 :-చిత్తం. సేకరించి పెట్టిన పళ్ళు తేనె సిద్ధంగా వున్నాయ్, ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను.(వెళ్ళును)
యాజ:- నిన్ను గురించి మేము విన్నదానికి ఇప్పుడు కల్లారాచూస్తున్నదానికి చాలా తేడా వుంది
యోహాను:- నాగురించి.. నాగురించి విన్నారా? ఏమని విన్నారు?
యాజ:- మేము మహోన్నతులైన యూదుల ప్రధానుల నుండి వారి ఆఙ్ఞ మేరకు నిన్నుగూర్చి తెలసుకోవడానికి వచ్చాము
యోహాను:- నేను మీ వంటి పెద్దలు విచారించి తెలుసుకోదగ్గ గొప్పవాడిని కాను.. మరీ..
యాజ:- నీ గొప్పతనం కాదు. నీ దోషములను విచారించి తెలుసుకొనుటకు మేమింత దూరము రావలసి వచ్చినది.
యోహాను:- ఏమంటిరి? నేను దోషినా?
చం:- ఎవరికి నెగ్గుచేసెఱుగ, నీ యటవీస్థలి నుండి నేవిధిన్
ఎవరికి కీడుసేయగల నెట్టులసేయగలాడ చూడగన్
వివరమెఱుంగ కిచ్చటకు వేగిరపాటున వచ్చియుందు రిం
దెవరును లేరు దోషజను, లియ్యది నిక్కము నమ్ము డయ్యరో.
యాజ:- సరి సరి.. అది ఇప్పుడే తేలగలదు.. నీవు చూస్తే ఆటవికుని వలె నున్నావు. నీవేమిటీ బోధ చేయడమేమిటి? తత్వశాస్త్ర పారంగతులము, ధర్మాధర్మ విచక్షణాపరులము, ప్రార్థనాలయయాజకులము నైన మేముండగా బోధ చేయుటకు నీ వెవడవు.
ఉ: ఎవ్వరి యాఙ్ఞలంబడసి యేమని బోధలు సేయుచుంటి వీ
వెవ్విధి నేమి నేర్చితివి యెవ్వడు నీగురు డేమిపేరు నీ
వివ్వనభూమి నందుగల యేటి జలంబుల బాప్తిజమ్మనుచు
న్నివ్విధి దీక్షలిచ్చు విధి యెక్కడనున్నది తెల్పుమంతయున్.
యోహాను:- అయ్యలారా! మంచిమాటలు చెప్పుటగూడా నేరమా? నేనీకార్యమునకే జన్మించిన వాడను. ఇది నా జన్మహక్కు.
యాజ:- అట్లయిన నీవు ప్రవక్తవా?
యోహాను:- అట్లని నేను అనలేదే?
యాజ:- మరి నీవెవరు?
తే;గీ: నీవు క్రీస్తువా? మరి యేలియావ? కాక
శాస్త్రమేమైన నినుగూర్చి సాక్ష మిడెన
లేక భూటక స్వామివా? నీకు నీవె
ఇంతకేమని తలతువు సుంత చెపుమా?
యోహాను:- అయ్యా, నేను శాస్త్రములో తెలుపబడిన క్రీస్తునూ గాను యేలియానూ గాను.
యాజ:- అట్లయిన మరి నీవెవరు? మళ్ళీ అడుగుతున్నాను. ఈపని చేయుటకు నీ కెవరధికారమిచ్చినారు. అసలు నిన్ను గురించి నీ వేమని చెప్పుకొంటున్నావు. విసిగించక వాస్తవం చెప్పు.
యోహాను:- మీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పియే తీరవలెనా? అసలు నేను చెప్పినను మీరంగీకరింతురా?
యాజ:- మమ్ము పంపినవారికి మేమీ వివరములు తెలియజేయవలసి యున్నది. కనుక తెలుసుకొనియే మేమిక్కడనుండి వెళ్ళవలసియున్నది.
యోహాను:- అయితే వినండి. నేను ప్రవక్తయోషయా ప్రవచనానుసారం జన్మించిన వాడను.
యాజ:- అంటే..
యోహావు:- "ప్రభువు మార్గము సిద్ధ పరచుడి
ఆయన త్రోవలు సరాళము చేయుడి
ప్రతి పల్లము పూడ్చబడును
ప్రతికొండయు మిట్టయు పల్లము చేయబడును
వంకర మార్గములు తిన్నని వగును
కరకు మార్గములు నున్నని వగును
సకల శరీరు లూ దేవుని రక్షణ చూతురు "
అని "అరణ్యమున యెలుగెత్తి పలుకు నొక శబ్దము" అని వ్రాయబడియుండుట మీకు తెలియదా!
యాజ:- తెలియును.
యోహాను:-
ఉ: ఆవనమియ్యదే యచటి యా స్వరమేగద! నా యెలుంగు, నే
నీవనమందు గ్రమ్మరుచు యేమరకన్ ప్రభువొచ్చునంచు నే
సేవకవృత్తి బూని శుభచింతనజేయుచు దారులూడ్చుచున్
దైవసుపుత్రు రాకడను త థ్యముగా తెలియంగబల్కితిన్.
క్రీస్తు రాకకు నేను కేవలము సూచన మాత్రమే. కాని ఆయన సాటివచ్చు వాడనుకాను. వాస్తవమునకు నే నాయన చెప్పులు మోయుటకు కూడా అర్హుడను కాను, కానని మీకు విన్నవించుకొనుచున్నాను.
శిష్యుడు1:- (వచ్చి) మహాశయా! ఇవిగో .
.
శిష్యుడు 2:-పళ్లు తేనె తేసుకొని వచ్చితిమి.
యోహాను:- యాజకులవారి కివ్వండి నాయనా... యజకోత్తమా గ్రహించండి సంతృప్తిగా భుజించండి.
యాజ:- అక్కరలేదు. నీవినయవిధేయతలకు నీవు చేస్తున్న పనులకు పొంతనలేదు. నీమాటలు మేము ససేమిరా నమ్మము. పవిత్ర యోషయా గ్రంథప్రవచనాలను నీతో పొల్చు కొనుట మాకేంతమాత్రమూనచ్చలేదు. ఆటవికుడవు నీవెక్కడ యోషయా గ్రంథమెక్కడ..
కం: చాలున్ చాలును ప్రేలెద
వేలా పెక్కులు పలుకకు మింకే పల్కుల్
మేలౌను నీకు నికపై
నాలుకపై నదుపు గలిగి నడుచుకొనంగన్.
లేనిచో మేమిదేపొయి నీమోసపూరిత వ్యర్థప్రసంగములను మా యూదుప్రధానులకు తెలియజేసి నీ ఆటకట్టించెదము.
శిష్యులు:-( కోపముతొ) మహాశయా!
యోహాను:- భయము లేదు... వారిని సురక్షితముగా వెళ్ళనిండు.(చురచుర జూచి యాజకుడు వెళ్ళిపోవును - యోహాను చిరునవ్వు నవ్వి) ఆటవికుడా గ్రామీణుడా లేక నాగరీకుడా అన్న భేదము మన కుండటానికి వీలు లేదు. అగ్రజాతులవారికే భగవంతుడన్న వారి వాదన అహంకారపూరితమైనది. వారినాదేవుడే రక్షించాలి.
ఉ: దైవము దృష్టిలో సమత తప్పక యుండును. హెచ్చు తగ్గులా
దైవమునందు లేవు. దరిదాపులచేరవు. దూర్తులెప్పుడున్
దేవుని చేరలేరు. కడుదీనలనెప్పుడు గాచు దైవమున్
గావున వీరి మాటలిక ఖాతరు చేయుట మానగావలెన్.
పదండి యీ ఫలాలనూ తేనెనూ మమే ఆరగిద్దాం- వారికి వీటి రసాస్వాదన చేయు ప్రాప్తము లేదు గాబోలు.
శిష్య 1:- దానికి మనమేంచేద్దాం. ఎవరి ప్రాప్తంవారిది.
శిష్య 2 :- మహాశయా!
తే:గీ: మిమ్ము వెతుకుచు వచ్చిన మిత్రుడనుచు
పిలుచుకొని వచ్చినారము తులవ నిటకు
నేరకపరాధ మొనరించినారమయ్య
కరుణ మా తప్పు సైరించి కావుమయ్య.
శిష్య 1:-దారి తెలియక వెతుకుతుంటే. ఇటు పిలుచుకొని వచ్చాం. అంతేగానీ మిమ్ములను దడించడానికి వచ్చిన పాపి యనుకోలేదు.
శిష్య 2 :- ఆఙ్ఞాపించండి. అతడు యీ లోయ దా టే లోపే ఒక ఆట పట్టించి బుద్దిచెప్పి మరీ పంపిస్తాం.
శిష్య1:- అవునౌను అటువంటి పాపిని ఊరికే వదలి పెట్టకూడదు. తగిన బుద్ది చెప్పవలసిందే.
యోహాను:- వలదు నాయనా..
మత్త కోకిల: పంతమూనగ నేల చెప్పుమ పాపకర్ముల చేష్టకున్
సుంత ఓర్మి వహించి శాంతము చూపగావలె కూర్మితోన్
చింతజెందగ నేల దుష్టులు చీదరించిన యంతటన్
యింతకున్ మనకేమి లోటగు నిట్టినారలమాటలన్
రానున్నవాడు శాంతి స్వరూపుడు.దయామయుడు. అతని రాకకై మనము దారిని శుభ్రపరచవలసిన వారము. అటువంటిది మనం ఆగ్రహావేశాలకు లోను కారాదు..
శిష్యుడు 1:- అంటే వారి అరాచకాలను చూస్తూ వూరకుండవలసిందేనా?
శిష్యుడు 2:- అసలు ఎందుకలా వుండాలి.
యోహాను:- ఆవేశము వదలండి, ఇకచాలు మనహృదయములను కల్మషరహితము గావించుకొని. శాంతి, దయ, కరుణ మన మాటలలో చేతలలో అగుపడునట్లు నడుచుకొనవలె, అప్పుడే ఆ ప్రభువు దారి సరళమౌతుంది. లోకకల్యాణం జరుగుతుంది.
తే:గీ: మెలగ వలయును మదిప్రేమ కలుగు నటుల
పలుక వలయును హృదిభక్తి పరిఢవిల్ల
నడువ వలయును సజ్జనుల్ నడచు దారి
విడువ వలయిను విద్వేష విషయ చయము.
విన్నారుగదా! ఇక పదండి చాలా ప్రొద్దు పోయి0ది ఫలాహారాలారగిద్దాం. పదండి.
( తెరపడును)
2,వ రంగము
(యోర్దాను నదీ తీర అడవి ప్రాంతము)
యోహాను:-ఆహాఁ!.. ఎంత పవిత్రత సంతరించుకొన్నదీయోర్ధాను నదీ తీర ప్రాంతము.
ఉ: హాయిని గూర్చు మారుతము ఆకస మంటెడు వృక్షజాతులున్
తీయని నీటనిండి నతితేటగ పారు నదీజలంబులున్
ఊయలలూగి నీటి యలలుత్సుకతన్ తిరుగాడు పుల్గులున్
శ్రేయమునిచ్చు నీ స్థలము చేరి కనుంగొను వారి కెంతయున్.
శిష్యులు:- యోహాను మహాశయులకు ప్రణామములు.
యోహాను:- దైవానుగ్రహ ప్రాప్తిరస్తు!
శిష్య1:- మహాశయా! యూదయ మరియు యొరూషలేము నుండి కొందరు భక్తులు మీకొరకు వచ్చియున్నారు. వారు మీ నుండి దీక్షతీసుకొని తరించాలని తొందరపడుచున్నారు.
శిష్య2:- వారు మీకోసం అరణ్యమార్గము గుండా నడచి ఇంతకు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు. ఈ యోర్ధాను నదిఒడ్డున ఆ కుటీరములో వారిని విశ్రమింపజేసి మేము మీ కొరకై ఇటు వచ్చాము మహాశయా. మిరాకకోసం వారుచాలా ఆత్రుతతో యెదురుచూస్తున్నారు.
యోహాను:- వారు ధన్యులు నాయనా.. నిరీక్షణకు చాలామహత్తున్నది. మహోన్నతవస్తువునకై వారుచేస్తున్న నిరీక్షణ వారి ఆత్మోన్నతికి సహాయపడుతుంది
శిష్య 1 :- ఔనౌను నిరీక్షణాకాలమంతా వారు లోకవ్యవహారముల నుండి దూరమై పవిత్రచింతనతోనే నిండివుంటారు.. అది తప్పక వారికి మేలు చేస్తుంది.
యోహాను:- సరిగ్గా గ్రహించావు. ఇన్ని మాటలేల.. ఇన్ని సంవత్సరాల నుండి
నేనుచేస్తున్నదీ ఆ పనేకదా నాయనా.. దైవము మనపై దయగలిగి యున్నాడు. పాపభూయిష్టమైన యీ మానవలోకాన్ని ఉద్దరించటానికి తన ప్రియపుత్రుని యీలోకమునకు అనుగ్రహించియున్నాడు.
తే:గీ: ఆ మహాత్ముడు లోకమందవతరించి
వె లు గులోనికి వచ్చెడు వేళయయ్యె
ననుచు నినదించు నాహృది ననవరతము
హెచ్చె నాత్రుత నాస్వామి వచ్చె ననుచు.
ఆ తేజోమయుని దివ్య సందర్శనార్థమే నా యీ నిరీక్షణా, తహతహ.
శిష్య 2 :- ఏమో మహాత్మా! మాకైతే యేమీ తెలియదు. మిమ్ము నమ్ముకొని సేవించుకుంటూ మీచెంత పడి. యున్నాము. మాకు మీరే దిక్కు.
యోహాను:- మిమ్మూ నన్నే కాదు, యీ సమస్తమానవాళిని రక్షించి బ్రోచు ప్రభువు రానున్నాడు. నా మాట నమ్మండి. ఆయన వచ్చునప్పటికి మార్గము సి ద్ధ ముచేసి ఆయవ త్రోవలు సరాళముగను శుభ్రముగను వుంచండి.ఇదే నా బోధ. ఈ పనేనాకు ప్రస్తుత దైవారాధన.
శిష్య 1:- నిజమే మహాత్మా అస్తవ్యస్తమై ధర్మచ్యుతి నొంది పతనావస్తలో పయనిస్తున్న జనాన్ని దై వము వైపు మళ్లించి ప్రభువు వచ్చి నిలుచుటకు తగు శుభ్రమైన స్థానాన్ని యేర్పాటుచేస్తూ మీరు చేస్తున్న కృషి అనన్యసామాన్యమైనది.
శిష్య 2:- నిన్నవచ్చిన ఆ యెరూషలేము యాజకులు మిమ్ము ధిక్కరించి నిందించివెళ్ళారు వారికంత ఆక్రోశమెందుకోమరి?
యోహాను:- ఏమున్నదయ్యా, ప్రజలు నిజము గ్రహించి మనవద్దకొస్తున్నారు. అలా జనులు వాస్తవమెరిగి మేల్కొంటే ఆ యాజకుల ఉనికికే ప్రమాదమేర్పడగలదు కనుక మనల్ని నిదించి తప్పుమోపి ప్రజలను వారి వైపునకు త్రిప్పుకొని వారి బూటకపు మాటలతో వారి ఔన్నత్యాన్ని కాపాడుకొంటున్నారు.
శిష్య1:- మరి వీరినుండి జనులెలా తప్పించు కోగలరు మహాశయా?
యోహాను:- ఆవిషయమై మీకెలాంటీ అనుమానమూ అక్కరలేదు.
చం: పరుశువు వృక్షమూలములపైనిడి యున్నది. వ్రేటువేయు నా
పరుశువు, పూసికాయక నపాయము దెచ్చెడి చెట్లవేర్లపై
తిరుగదిలేదు దైవసుతు తీర్పునకా విషతుల్యులందరున్
విరుగుదురింక మారక, వివేకము జూపక మూర్ఖులైచనన్.
మంచి ఫలముల నియ్యని ప్రతి జీవికీ ముప్పు తప్పదు. నమ్మికగల్గి యుండుటే మన విధి.
శిష్య 2:- అలాగే మహాత్మ ఇక మనం బాప్తిజ మిచ్చు కార్యక్రమం మొదలు పెట్టుటకు వెళ్ళెదమా?
యోహాను:- మంచిది మీరు ముందువెళ్ళి భక్తబృందాన్ని సాదరంగా వెంటగొని రండి. వారి కీ జలములలో దీక్ష నొసంగెదను. వెళ్ళిరండి.
శిష్యులు:- చిత్తం (ఇద్దరూ వెళ్ళుదురు)
యోహాను:- ఏమది. ఏమాప్రశాంత దివ్యకాంతి. నావైపే వస్తున్నది, ఆఁ! ఆకాంతి ఒక దివ్యపురుషుని రూపు ధరించి ప్రసన్న వదనారవిందంతో దరహాసపు రుచులతో సమీపించుచున్నది... ప్రభూ.. వచ్చావా ప్రభూ! వచ్చావా! నాపై కృపజూపి నా కొరకై వచ్చావా! (మోకాళ్ళపై నిలబడి ప్రణమిల్లును)
క్రీస్తు:- (లేపి) వచ్చాను యోహాను మహాశయా వచ్చాను. మీ కోసమేవచ్చాను.
కం: వచ్చితి మీ చరితము విని
వచ్చితి మీరిచ్చు దీక్ష వడయుటకొరకై
వచ్చితి మీదీవెన నే
వచ్చిన పని మొదలిడంగ వసుధాస్థలిపై.
యోహాను:- నేను మీకు బాప్తిజమిచ్చుటయా? ఏమిటి ప్రభూ మీరంతున్నది.ఈదీనునిపై పరిహాసమా ప్రభూ?
క్రీస్తు:- లేదు యోహానుమహాశయా! పరిహాసమేమాతమూ కాదు . నీ నుండి దీక్ష పొందుటకే నే నింతదూరము వచ్చితిని.
యోహాను:- ప్ర భూ.. మీనుండి మేము దీక్షపొందవలసి యుండగా....
క్రీస్తు:- యోహాను మహాశయా మీరు దైవానుగ్రహ సంపన్నులు.నా కంటే పెద్దవారు. గాన లోకాచార యుక్తముగా పెద్దవాడవైన నీ చేత నేను దీక్ష పొందవలసి యున్నది. అంతేకాదు..
తే:గీ: శాస్త్రలేఖన మిట్లుండె. జరుగ వలదె
దాని నెదిరించి తప్పింప దగునె వినుము
బాప్తిజమ్మిమ్ము నాకింక భావ్య మనుచు
దైవ సమ్మతమిది యోయుదార చరిత.
యోహాను:- తమరి యాఙ్ఞ మాకిక శిరోధార్యము.
క్రీస్తు:- మహాశయా.. జలాశయం వద్దకు వెళదాం పదండి. అక్కడ అందరి తోపాటు నాకునూ దీక్ష నిత్తురు గాక!
యోహాను:- మంచిది .. ఇటు దయచేయండి.. పదండి(ఇద్దరూ నిష్క్రమింతురు)
(ఎర్రనికాంతి రంగస్థలంపై క్రమ్ముకొనును ఒక పెద్దపామును
వ్రే లాడునట్లుచేసి నాగస్వరం వినిపించి తర్వాత నాగస్వరం తగ్గించి మాటవినబడునట్లు చేయాలి. ఆ పామే సైతాను అనుకోవాలి)
సైతాను:- (పెద్దగా నవ్వి)జనము నపమార్గము పట్టించి దేవునిపై నమ్మకము వమ్ము జేసి అల్లకల్లోలము సృష్టిస్తున్న సైతానును నేను (మళ్ళీ పెద్దగానవ్వు)నాకార్యముల కడ్డుపడుదురా యీయోహాను మరియు నీ మరియ పుత్రుడు. చూచెదగాక! వారు నా మాయకు లొంగెదరా సరి. లేకున్న నా విషాగ్నికి బలై పోయెదరు.(భయంకరంగా అరచి నవ్వును. చిన్నగా పాము వెనక్కి వెళ్ళి పొవును. పరిస్థితి సామాన్యమై పోవును)
యోహాను:- (శిష్యులు, క్రీస్తు వచ్చెదరు) నాయనలారా! మీరు కళ్ళారా చూచితిరిగదా! ఈయన నన్నాదరించ దలచి నా చేత బాప్తిజము పొందెనుగానీ లేకున్న నే నెంతటి వాడను. నేను నీటియందు బాప్తిజము నిచ్చితిని గానీ యీయన అగ్నితోను పరిశుద్దాత్మతోనూ బాప్తిజమియ్య సమర్థుడు .ఈ మహనీయుని దర్శనభాగ్యమున మన జన్మలు ధన్యములైనవి.(క్రీస్తు వైపు తిరిగి)
సీ: ఏదీను వేదనల్ యెరిగి దీర్పగ నెంచి
ధరణి కేతెంచితో పరమ పురుష
ఏపతితుని పాప మెంచక బ్రోవంగ
భువికేగుదెంచితో బోధ గురుడ
ఏరోగి బాధల నేరిపారగద్రోల
నవనికేతెంచితో అమృత మూర్తి
ఏభక్తజనముల బెంచి మోక్షమునియ్య
నిల నడుగిడితివో యేసుప్రభువ
తే: అట్టి నినుగన నీవనమందు నిలచి
కనుల వత్తుల నిడికొని వినతు లిడుచు
బాటలన్నియు పరిశుభ్ర పరచుకొనుచు
కాచుకొని యుంటిమో ప్రభూ! కావు మమ్ము
(అందరూమ్రొక్కుదురు)
క్రీస్తు:- దైవానుగ్రహ ప్రాప్తిరస్తు!(ఆకాశంవైపు చుస్తూ చెతులు ప్రార్థనాపద్దతిలో తెరచి యుంచి) ఇక నాకు సెలవు. (వెళ్ళిపోవును)
యోహాను:- ఆయన సాక్షాత్తూ దేవుని బిడ్డ. అందుకు సం దేహము లేదు. నాచేత దీక్షగైకొన్న మరు క్షణమే పరిశుద్దాత్మ పావురము రూపమున వచ్చి ఆయనపై వ్రాలెను. ఆకాశము తెరువబడి యితడే నా ప్ర్రియతనయుడు. ఈతని ద్వారా నా మహిమ ప్రకటింపనున్నానని దైవవాణి ఘోషించినది.కనుక మీరు ఆలసింపవలదు. ఆయన వెంట వెళ్ళండి. వెళ్ళీ ఆయనను సేవించండి.
శిష్యులు:- తమరి ఆఙ్ఞ.. సెలవు.
(తెర వ్రాలును)
3,వ రంగము
(పెద్దపాము రంగస్థలము మీద వ్రేలాడుచుండును. అదే సైతాను. ఎర్రని కాంతి నిండి యుండును)
సైతాను:- ఈ మరియపుత్రుడు దేవుని బిడ్డయట.. దేవునిబిడ్డ.. నామాయాజాలమున చిక్కువడి నలువది అహోరాత్రములు అన్నపానీయములు లేక ఉపవసించుచున్నాడు ఇప్పుడు కనుగొనియెదగాక! ఈతనికి దైవముపై గల విశ్వాసమెంతటిదో? ఓయేసూ! ..మరియాసుతా!
క్రీస్తు:- (వస్తూ) ఎవరు.. ఎవరు నన్ను పిలుస్తున్నది.
సైతాను:- నేనే సైతానును. ఏసూ.. ఆకలిగనున్నదా?
క్రీస్తు:- ఆఁ...
సైతాను:- నీవు దేవుని ప్రియపుత్రుడవుగదా!
క్రీస్తు:- ఔను...
సైతాను:- నీవు నిజముగా దేవుని పుత్రుడివేఐతే నీ తండ్రిపై నీకు అచంచల విశ్వాసమే వుంటే యీ రాళ్ళను రొట్టెలగునట్లు చేయమనుము. నీవు భు జిం చవచ్చును.
క్రీస్తు:- మనిష్యుడు రొట్టెల వలన మాత్రమే జీవింపడు. దైవ వాక్యము వలన జీవించును. ఇది సత్యము. పవిత్రగ్రంధములందు యిదే లిఖింపబడి యున్నది.
(లైట్లు అఫ్ చేయబడి ఒక శబ్దము చేయడంద్వారా తెరమార్చి లైట్లు ఆన్ చేయవలెను)
సైతాను:- ఇదిగో నా మంత్ర శక్తి వలన పరిశుద్దపట్టణము లోని ఆలయశిఖరమునకు చేరుకొన్నాము. నీవు ఇక్కడనుండి క్రిందకు దుముకుము. నీ దేవుడు దూతలను బంపి నిన్ను క్రిందపడకుండా పట్టుకొనునట్లు జేసి కాపాడు నేమోజూతము.
క్రీస్తు:- అవశ్యము. నీవన్నట్లే జరుగును. కానీ నేను దూకను. నాతండ్రిని నేను అనవసరముగా శంకించి పరీక్షింపను.
(లైట్లు ఆఫ్ చేసి ఒక శబ్దము చేసి తెర మార్చనలెను తర్వాత లైట్లు వెలుగును)
సైతాను:-సరిసరి... నా మహిమ వలన యిదిగో మనం ఒకకొండ శిఖరంపై చేరితిమి. చూడుము నీకు స్పష్టముగా కనబడుతున్న యీ రాజ్యము లన్నింటినీ జూడుము. ఇవన్నీ నా అధీనములు. ఒక్కసారి నాకు సాగిలబడి మ్రొక్కుము, నాకు దండప్రణామము లాచరించి నా నాయ కత్వ మంగీకరింపుము. నేను యీ రాజ్యములన్నింటికీ నిన్ను చక్రవర్తిని చేసెదను. నిన్ను భోగభాగ్యలలో తేల్చెదను. నీ వెంట వేలాది కన్యలను భృత్యులను నియమించెదను. నీవు కోరినవెల్ల సమకూర్చెదను.
క్రీస్తు:- అందరికీ ప్రభువు ఆ దేవుడే. ఆయనకు మ్రొక్కి ఆయననే సేవింపవలెను. యివి పవిత్ర గ్రంధములన్నీ నొక్కివ క్కా ణించు చున్నవి.ఇది సత్యము. దీనికి విరుద్దముగా నేను ప్రవర్తింతుననుకొనుట కేవలమూ నీ భ్రమ. నీవు చూపు ప్రలోభములకులొంగు నంతటి బలహీనుడనుగాను. దైవానుగ్రహము నాయందు నిండుగానున్నది. వెళ్ళు.. నన్ను వీడి వెళ్ళు.. అదిగో నా దేవుడు సర్వలోకైకనాధుడు, నన్ను రక్షించుటకై నన్ను సేవించుటకై తన దూతలను పంపుచున్నాడు. వారిదే వచ్చుచున్నారు. ఇకనీవు వెళ్ళు.. వెళ్ళిపో.. నేనున్న చోటికి యికనీవు రాలేవు. నీ ఆటలు నారాకతో కట్టు.. వెళ్ళు...
(ఒకశబ్దంతో సైతాను శబ్డం నిలచిపోవును-రంగస్థలంపై పూర్తి వెలుగు నిండును)
శిష్యులు;-(పరిగెత్తుకొంటూ వచ్చి యేసు కాళ్ళపై బడి) ఏసు ప్రభూ!
శిష్య 1 :- ఇక మీ రే మాకు రక్ష.
శిష్య2:- మా గురువర్యులు యోహాను మహాశయుని ఆఙ్ఞానుసారం మీ పాదసన్నిధికి యిప్పటికి జేరుకోగలిగితిమి.
శిష్య 1:- ప్రభూ! మమ్ముల నంగీకరించండి.
క్రీస్తు:- నన్ననుసరించుటకు అయోగ్యులను వారలెవ్వరునూ లేరు. సర్వజనులకూ నా మర్గమెప్పుడూ తెరువబడే వుంటుంది. దైవసామ్రాజ్యమునకు నేనే ద్వారమును.
(ఏసు బయలుదేరును వెంట శిష్యులూ వెళ్ళుదురు.)
(తెరవ్రాలును)
4,వ రంగము
(కారాగారంలో యోహానుండును.- హెరోదురాజు, అతనిఉంపుడుగత్తె కూతురు ప్రవేశం)
హేరోదు:- (నవ్వి) ఆఁ!.. ఏమోయ్ యోహన్ యిప్పటికైనా బుద్ధివచ్చిందా?
యోహాను:- బుద్ధి. బుద్ధిఙ్ఞానము దేవుడు నాకు పుట్టుకతోనే అనుగ్ర హించాడు. అసలు బుద్ధి రావలసింది నాకు గాదు యేండ్లుపై బడినా యింకాబుద్ధి రాని నీకు.
హేరోదు:- నోరుమూయ్.. ఎంత కడకావరంరా నీకు (చెంపచెళ్ళు మనిపించును)
కుమార్తె:- ఏంటినాన్న గారూ.. నాకు భయంవేస్తూంది . పిచ్చివాడా యితడు.
హేరోదు;- అవును తల్లీ పిచ్చివాడే. అయినా గొలుసులతో కట్టించానుగా? భయంలేదు.
యోహాను:- అవును పిచ్చివాడనే. తప్పతాగి వివేకహీనుడై సోదరుని ఇల్లాలనే యింగిత ఙ్ఞానమైనాలేక పరస్త్రీలోలుడైన ఉన్మత్తుని దృష్టిలో నేను పిచ్చివాడనే ... పాముపిల్లా! నీకుగూడా నేను పిచ్చివాడిలాగానె కనిపిస్తున్నానా?
హేరోదు:- ఎవరక్కడ? ఈ దోషిని చీకటి గదిలో బందించండి. దారికొచ్చేవరకు అన్నపానాదులివ్వకండి.
యోహాను;- మీ పాడు మొగాలు చూస్తూ ఉండటంకంటే చీకటిగదే మేలు.. తూ..(వెనక్కి తిరిగి వెళ్లును)
కుమార్తె:- ఏమిటి నాన్నగారు! నన్నిక్కడికి తీసుకవచ్చారు.
హేరోదు:- నీవేగదమ్మా.. చెరసాల చూద్దామన్నావు?
కుమార్తె:- చెరసాలంటే యిదా! వద్దు బాబు నేనిక చూడలేను వెళదాంపద.
హేరోదు:- అంతగా చూడాలని వచ్చావుగదా! మిగిలిన గదులు కూడా చూచే వెళదాం తల్లీ!
కుమార్తె:- వద్దు నాన్నగారూ.. ఇక బయటికి వెళ్ళిపోదాం. అవునాన్నగారు.. ఇతనెవరు? ఏంనేరం చేశాడు. చూస్తే పిచ్చివాడు కాదేమో ననిపిస్తుంది.
హేరోదు:- పిచ్చివాడేనమ్మా! కాకపోతే ప్రభువునైన నన్ను జూచి
ప్రా ధేయపడి క్షమాపణ కోరవలసినది పోయి, యిలా పిచ్చిగా
వాగుతాడా? ఇతడు.
తే:గీ: పిచ్చి తలకెక్కి నోటికివచ్చినట్లు
ప్రభువుననియైన తలపక పాపి యనుచు
దిట్టుచున్నాడు మమ్ముల తెలివిదప్పి
కాన వేసితి నితనికి కఠిన శిక్ష.
అంతేకాదు మీ అమ్మను మరీ మరీ దూషించాడు తల్లీ!
కుమార్తె:- ఆఁ!..
కం: మామాతను దిట్టెనుగా!
యేమీతని కండక్రొవ్వు యేమని తలచున్
ఈమాత్రపు శిక్షలితని
కేమాత్రము చాలవయ్య హేరోదుప్రభూ!
చూడు వీని గతి అమ్మతో చెప్పి వీని పనిపట్టిస్తాను.
హేరోదు:- నీలాగే నాకూ కోపమొచ్చిందమ్మా.. చంపేద్దామనుకొన్నాను.. గానీ..
కుమార్తె:- కాని...
హేరోదు:-కానీ వీడి వెనుక జనమున్నారు. వారితన్ని దైవాంశ సంభూతునిగా భావిస్తున్నారు. వీణ్ని చంపితే జనం మన మీదికి తిరగబడతారు.
కుమార్తె:- అంత భయమెందుకు నాన్నగారు.. వీడి మాటలు వినవద్దని ప్రజలకు హేరోదు మహారాజుగా మీరు నచ్చజెప్ప వచ్చుగదా!
హేరోదు:-నీకు తెలియదు తల్లీ.. వారు నమ్మరు . వారినిశ్వాసము వారిది. అసలు వీడి పుట్టుకే అసమాన్యమైనది.
ఉ: ఈతడు పండు నృద్ధులకు నే విధి బుట్టెనో నాకె చిత్రమౌ
నీతని జన్మమా పితరు డెవ్విధి మున్నె నెఱుంగ గల్గెనో
నీతని వాక్కులున్ పనులు నీతని వేషము తిండి తిప్పలున్
చూతముగాదె యేవియును సుంతయు నర్థముగావు నెంతకున్.
కుమార్తె:- అయితే వీడొక విచిత్రమైన మనిషన్నమాట
హేరొదు:-అవును తల్లీ.. సరిసరి యివన్నీ ఆలోచించి నీ మనసు పాడుచేసుకోకు. ఇక వెళదాం పద.(బయటికి వెళతారు. రంగ స్థ లం చీకటై మళ్ళి చిన్నగా వెలుగు పరచుకొంటుంది)
క్రీస్తు:- యోహానూ.. యోహానూ..నేనొచ్చానయ్యా రా బయటికి... రా..
యోహాను:-(వచ్చి) ప్రభూ!
క్రీస్తు:- నీ చీకటిగదిద్వారం తెరువబడింది. వెలుగు ప్రసాదింపబడింది. రా యోహానూ రా..
యోహాను:- ప్రభూ! నన్ను కరుణించావా.. నామొరవిని నన్ను
అనుగ్ర హించవచ్చావా..
సీ: నీచింతనన్ మున్గి నీయండ నాశించు
నాపన్నులన్ జేరి ఆర్తిబాపి
నీబోధనల్ విని నీవెంట నడచెడు
సజ్జనులకు గల్గు శంకదీర్చి
నీపాదముల జేరి నీకు శరణముజొచ్చు
పాపులదోషముల్ పారద్రోలి
నీవెదిక్కని నమ్మి నినుజేరి రోదించు
రోగుల రుగ్మతల్ బాగుజేసి
తే:గీ: దైవపుత్రుడవీవన ధరణి యందు
వెలసి నా వయ్య యేసయ్య తెలిసి నీదు
మార్గమందున చరియించు మానవులను
దైవసన్నిధి జేర్తువు దారి చూపి.
క్రీస్తు:- యోహాను.. నీవుజన్మించినవారందరిలో మిక్కుటముగా అనుగ్ర హింప బడిన వాడవు.
యోహాను:- ప్రభూ యికచాలు. ఈ జీవితానికిది చాలు.
క్రీస్తు:- నీ కార్యభారాన్ని నీవు ఓర్పుతో మోసి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించావు.
యోహాను:- తమరి ఆశీర్వాదము ప్రభూ.. ఇప్పుడు నాకు చాలా
సంతోషముగానున్నది. నాబాధ్యతలను నేను నిర్వహించానన్న
సంతృప్తి కలిగినది. ఇక తమరు పనిని చేపట్టారు. ఫలితములు కనులున్నవారికి గోచరిస్తూనేయున్నవి. ఈ లోకంలో నా పని పూర్తయింది. ఇకనాకు పరలోకయాత్రకు అనుమతించండి ప్రభూ..
క్రీస్తు:- యోహాను! మంచిది అందులకు నీ వు సమీపములోనే ఉన్నావయ్యా! నీ వు వచ్చుట వెళ్ళుట కూడా సంచలనాత్మకమేకాగలదు.
కం: శ్రమకోర్చుకొనెడు శక్తిని
క్రమగతి నీ కొసగబడియె కాలంబయెన్
నీమనమిక శాంతించున్
ధీమంతుడ నీవు గొనుము దీవెన లిడితిన్.
యోహాను:- మహాప్రసాదము.(నమస్కరించును)అంతా యిక దైవేక్ష.
క్రీస్తు:- దైవసామ్రాజ్యమున నీకొక ఉన్నత స్థానము కేటాయింపబడినది. త్వరలోనే నీవాస్థానాన్ని అలకరించగలవు.
యోహాను:- ధన్యుడను ప్రభూ.. ధన్యుడను.
క్రీస్తు:- ఇక సెలవు.
(తెర వ్రాలును)
5,వ రంగము
(హేరోదు ఆసవం సే విస్తూవుంటాడు. కుమార్తె వస్తుంది)
కుమార్తె:- నాన్నగారు.. నాన్నగారు.. నోరు తెరవండీ..
హేరోదు:- ఏమిటమ్మా...
కుమా:- ముందు మీరు నోరు తెరవండీ..
హేరోదు:- సరే..(మిఠాయి నోట్లో పెడుతుంది) భలే వుందిరా యెంతమధురంగా వుంది, ఏమిటమ్మా యిదీ..
కుమా:- మీకేం తెలియదు నాన్నగారు. పాలు పంచదార ఖర్జూరాలు వేసి అమ్మ తయారు చేసిన మిఠాయి యిది. ఈ రోజు మీ పుట్టినరోజు గదా! అందుకని అమ్మే ప్రత్యేకంగా తయారు చేసింది.
హేరోదు:- ఆఁ!.. మిఠాయి మీఅమ్మలాగే కమ్మాగా ఉందిరా!
కుమా:- మీపుట్టినరోజు సందర్భగా నేనొక కవిత చెబుతాను. ఏమంటారు.
హేరోదు:- అబ్బో కవితే! ఊ..చెప్పరా నిందాం.
కుమా: జన్మదినం వచ్చింది - భూనాధులకీదినం
జన్మంతా మరచిపోదు - జనం యీదినం
సంబరాలయీదినం - సంతోషసమన్వితం
జనులందరి పర్వదినం - జననాయకు జన్మదినం... /జన్మదినం/
కోయిల ఎలుగెత్తి పలికె - ఈరోజును రార మ్మని
నెమలి ఫింఛము విప్పి- స్వాగతమ్మును తెలిపె
రాజహంసగణము - రాజుఘనతను చాట
గగనాని కీనాడు - గర్వముగ నెగసె...../జన్మదినమ్/
పావురాళ్ళ గుంపు - పరమమోదముదెల్పి
పక్షతాళద్వనులు - మాటిమాటికి జేసే
కుసుమాలు వికసించి - నవ్యకాంతులనీనె
షట్పదమ్ములు జేరి - శ్రావ్యనాదము జేసే..../జన్మదినమ్/
హేరోదు:_ బ్రహ్మాండంగా వుందిరా.. నీకవిత.
కుమార్తె:- నేనొక నాట్యంనేర్చు కొన్నాను. చెయ్యమంటారానాన్నగారు.
హేరోదు:- నువ్వు నాట్యంచేస్తానంటే వద్దంటానా? చేసెయ్
కుమార్తె పాటా-ఆటా
సగీత సహిత్య సారంబు - గ్రహియించి
లయలు హొయలను గూర్చి - అభినయంబున జూపు
నటనమె కడు రమణము - నా నాట్యమె రమణీయము
నాహావ భావాల - నటనమునకు పొంగి
కొండచరియల ఝరులు - త్రుళ్ళింతలిడిజారె
నా మేని జిగిబిగి - వయ్యారముగని
విద్యుల్లత చాల విప్పారి మెఱిసె................./సంగీత/
కాలి గజ్జలరవళి - మేఘనినదముబోలు
కనుల కొసచూపులె - మెఱపు తీవలసాటి
చిరుమందహాసంబు - తళుకు తారల తోడు
మేనీ వొంపుల సొంపు - సితచం ద్రి కల సమము......./సంగీత/
హేరోదు:- అద్భుతం బ్రహ్మాండంగావుందిరా నీ ఆటా పాట కొరుకో నీ కిష్టమైన బహుమానం యిచ్చేస్తా.
కుమార్తె:- బహుమానమా? ఏంకోరుకోవాలబ్బా!
హేరోదు:- కోరుకోరా! నీ యిష్టమోచ్చింది కోరుకో.. నేనివ్వడానికి సిద్ధం.
కుమార్తె:- ఉండండి అమ్మనడిగి వస్తాను.(లెళ్ళును)
హేరోదు:- పిచ్చిపిల్ల. కోరుకొనే బహుమానం కూడా తల్లి నడీగే కోరుకోవాలా? ఔను.. అంతా దానిష్టమేమరి. ఈపిల్ల విషయమేకాదు నా విషయంకూడా అంతేమరి.. దాని యిష్టానికి వ్యతిరేకంగా నేను మాత్రం ఒక్క అడుగైనా వెయ్యగలనా? దాని అందానికి నేను దాసుడనై పోయాను. ఆహాఁ! .. ఏమి దాని యందము..
సీ: కాంచనవర్ణమై కాంతులీనెడు మేను
నిడివి చాల గలట్టి నీలి కనులు
రత్నవర్ణంబై మెఱయు నట్టి యధరంబు
ధవళ కాంతులు జిమ్ము దంతచయము
సమపీనవైభవ సాధిత స్థనములు
సన్మోహనంబైన సన్న నడుము
నాణ్యమై యోప్పారు నవకంపు కరములు
మెత్తగ నొత్తుగ మెఱయు కురులు
తే:గీ: అన్ని విధముల నాయింతి యందమందు
సాటి లేనట్టి దనుచును చాటనొప్పు
నెలత వయ్యార మిదియంచు నిర్వచింప
వచ్చు నియ్యింతి యవయవ వరుస జూపి.
అంతటి అందగత్తె యది. దాని మాటంటే మాటే మరి..
కుమార్తె:- (తిరిగి వచ్చి) కోరుకోమంటారా నాన్నగారు.
హేరోదు:- ఊఁ.. కోరుకో..
కుమా:- మాటతప్పకూడదుమరి.
హేరోదు:- ఈ హేరోదు ఎన్నటికీ మాటతప్పడు. కోరుకో.. ఆలస్యమెందుకూ కోరుకో.
కుమా:- అయితే కోరుకుంటున్నా...
హేరోదు:- ఊఁ!.
.
కుమా:- నాకీ రాజనగరులో కొదువేమీ లేదు. సకల వైభోగములూ నాసొత్తు. నాకంటూ ప్రత్యేకంగా కోరుకోవలసిదేమీ లేదు. మా తల్లిని ఆనందపరచడమే నాకు కావలసిది.
హేరోదు:- ఈ ఉపోద్ఘాతాలెందుకూ, తల్లీ కూతుళ్ళు కలసి కోరుకోదలచిందేదో చెప్పండి.. వెంటనే యిప్పిస్తాం.
కుమార్తె:- అయితే కోరుకుంటున్నాను వినండి.
కం: అమ్మను దిట్టినవాడిక
నిమ్మహి జీవింపరాదు హేరోదు ప్రభూ!
తెమ్మనుమా యోహాన్ తల
కొమ్మని మాయమ్మకిత్తు కొండాడ ననున్.
వెంటనే ఆ యోహాను తల నరికి తె ప్పించి మాచేతిలో పెట్టించండి. ఇదేనా కోరిక.
హేరోదు:- ఆఁ!.. యోహాను తలా?
కుమా:- అవును యోహాను శిరమే.
హేరోదు:- వద్దు బిడ్డా వద్దు. అంత కఠిన కసాయి కఱకు కోరిక కోరదగదు. వద్దు తల్లీ నీ మనసు మార్చుకో. ఇంకేదైనా కోరుకో..
కుమార్తె:- మా మనసుమారదు. మాకు యోహాను మస్తకమే కావాలి ఇదేమా ఆఖరు నిర్ణయం.
హేరోదు:- వద్దమ్మ.. అతడు ప్రజలమనిషి. అతనికి కారాగారశిక్ష వేసినందుకే ప్రజల్లో అలజడి మొదలైంది. వాని తిట్లకు, నిందలకూ భరించలేక చెరసాలలో వేయించి ప్రజల్లో రాజకుటుంబంపై వస్తున్న అసహ్యాన్ని నిలుపుదల చేయించాను. వాడు చస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. నామాట విను తల్లీ.. ఈ విపరీతపు కోరిక మానుకో నీ యిష్టమొచ్చినదింకేమైనా కోరుకో తప్పక తీరుస్తాను.
కుమార్తె:- నాకింకేమీ అక్కరలేదు. యోహాను శిరం యిప్పిస్తారా లేక మాట తప్పుతారా? తేల్చుకోండి.
హేరోదు:- స్త్రీ బుద్ది ప్రళయాంతకమని తెలిసి తెలిసి ఆపద కొనితెచ్చుకొన్నాను. సరిసరి.. ఏమైననూగానీ యీ హేరోదు మాటతప్పడు.. ఎవరక్కడ?
అంతఃపుర రక్షకుడు:- (బయటనుండే) ప్రభూ!.. (హేరోదు మాట్లాడేంత లోపలే)
కుమార్తె:- మీకెందుకు ప్రభూ శ్రమ.. నేనే చెబుతాను. ఇది హేరోదు మహారాజుగారి ఆఙ్ఞ తలారులను వెంటగైకొనివెళ్ళి ఆ యోహాన్ను శిరచ్ఛేదము చేయించి తలను పళ్ళెరములో నుంచుకొని ఇక్కడకు వెంటనేరమ్ము.. వెళ్ళు.
అంతఃపురరక్షకుడు:- (ఆశ్చర్యముతో బయటినుండే) ప్రభూ!
హేరోదు:- వెళ్ళు.. కారాగారాధికారికి మా ఆఙ్ఞ నెరిగించి పని పూర్తిగావించు కొని రా.. ఆగూ.. అంతకంటేముందు నగరసంరక్షనాధికారికి విషయమెఱిగించి రహస్యముగా కట్టు దిట్టమైన యేర్పాట్లు గావించి యెక్కడా అలజడి జరగకుండా జాగ్రత్త వహించమను. ఎప్పటికప్పుడు మా ఆఙ్ఞలకై యెదురుచూస్తూ వుండమని కూడా చెప్పు. ఇక వెళ్ళిరా..
అంతఃపురరక్షకుడు:- (బయటి నుండే) చిత్తం తమరి ఆఙ్ఞ ప్రభూ!
(హేరోదు ఆసవం సేవిస్తూ తూగుతూ ఆసవంపైనే వాలి పోతాడు. అతడు మత్తులో మునిగి పోతుండగా ఉంపుడుగత్తె కూతురు నాగిన్ నృత్యం చేస్తుంది. నృత్యం చాలా కఱకుగా నూ వికృతం గాను సాగుతూ వుంటుంది (కాసేపటికి)
అంతఃపురరక్షకుడు:- (బయట నుండే)ప్రభూ.. యోహాను శిరము తీసుకరాబడింది.
కుమార్తె:- (నాట్య మాపి) ఆఁ! యోహాను శిరం ఖండించి తేసుకొచ్చారా..(పెద్దగానవ్వి- బయటకువెళ్ళి పళ్ళెరంలో వస్త్రం కప్పియున్న తలను తీసుకొని వచ్చి వెనక్కు తిరిగి వస్త్రం తొలగించి చూచుకొని మళ్ళీ పెద్దగానవ్వి చేతిలో పళ్ళెరంతో నృత్యం చేసుకొంటూ లోనికి వెళ్ళిపోతుంది. రాజు మత్తులో తూలి ఆసనం నుండి క్రింద వెల్లెలికల పడి కలవరిస్తూ వుంటాడు.)
(తెర వ్రాలుతూవుండగా నాటకాంతపు వ్యాఖ్యానం వినబడుతూ వుంటుంది)
వ్యాఖ్యానము
అలా జకర్యా కుమారుడైన యోహానుమహాశయుని జీవితం ముగిసింది. మహాత్ముల రక్తధారలే ఆధారంగా దైవరాజ్యం యేర్పడవలసియున్నది. అది దైవేచ్ఛ. దానికి తిరుగు లేదు. మహనీయుడైన ఆ యోహానుసత్పురుషచరిత్ర బైబిలు పవిత్రగ్రంథమున సువర్ణాక్షరములతో లిఖింపబడింది. అమ్మహాత్ముని జీవితగాథను దృశ్యకావ్య రూపమున తిలకించిన మీకందరకూ శుభమగగాక!.. ఆమెన్.
(నాటకము సమాప్తము)
౦6--౦4--2౦12, న గుడ్ ఫ్రైడే సందర్భమున ఆకాశవాణి కడప ద్వారా
ఉ:9-౦౦ గ// ఈ నాటకాన్ని(పద్యాలులేకుండా) ప్రసారం చేయడం జరిగింది]
v
No comments:
Post a Comment